* మారుజోడు రాంబాబు
* రైతులకు మద్దతు ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్య
స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్తగా, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీశ్ చంద్రారెడ్డి హెచ్చరించారు.
శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని మారుజోడు రాంబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రకటించి రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ధాన్యం తరలింపుపై అధికారులతో సమీక్ష
ఈ సందర్భంగా రఘునాథపల్లి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచనల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, పోలీసు అధికారులు, ఐకేపీ సిబ్బంది, లారీ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న కొనుగోళ్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ మేకల నరేందర్, వరలక్ష్మి, గాదె మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కడారి రవి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.



