స్పాట్ వాయిస్, పటాన్ చెరు: దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగినప్పుడే భారత్ నిజమైన ప్రగతి సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలోనూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ, మహనీయులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో చేపడుతున్న చర్యలు సామాజిక అసమానతలను తగ్గించేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
