స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. తాజాగా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… బొలెరో వాహనం పంచర్ కావడంతో డ్రైవర్ మరో వ్యక్తి సహాయంతో లారీని ఆపి టైర్ మార్చే పనిలో ఉన్నారు. ఈ సమయంలో మరో లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఇదే జిల్లాలోని నవాబుపేట గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.తరచూ జరుగుతున్న ప్రమాదాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


