
-
టన్నెల్లోకి భారీగా నీరు, శిథిలాలు..
-
ఏడుగురు కార్మికులు మృతి
చమోలి: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు, శిథిలాలు దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో మొత్తం 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 14 మంది గాయపడగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. టన్నెల్లో పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న ఇద్దరు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టన్నెల్లోకి ఒక్కసారిగా నీరు, శిథిలాలు ప్రవేశించడం ప్రమాదానికి కారణమైనట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

