డిజిటల్ మోసాలకు చెక్
- గంట ఆలస్యంతో డిజిటల్ లావాదేవీలు..
- ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
- పదివేల రూపాయలు పంపాలంటె గంట సమయం
స్పాట్ వాయిస్, వరంగల్: దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పెంచుతూ వినియోగదారులకు అదనపు రక్షణ కల్పించే చర్యలపై దృష్టి సారించింది.
రూ.10 వేలపై లావాదేవీలకు ఆలస్యం
ఆర్బీఐ ప్రతిపాదనల ప్రకారం, రూ.10,000 పైబడిన డిజిటల్ ట్రాన్సాక్షన్లను వెంటనే పూర్తి చేయకుండా ఒక గంట పాటు నిలిపివేయాలని భావిస్తోంది. ఈ సమయంలో వినియోగదారులు లావాదేవీని పరిశీలించి, అనుమానం ఉన్నట్లయితే రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మోసపూరిత లావాదేవీలను ముందుగానే అడ్డుకోవచ్చని ఆర్బీఐ అభిప్రాయం.
వృద్ధులకు ప్రత్యేక రక్షణ చర్యలు
సీనియర్ సిటిజన్లు మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, రూ.50,000 పైబడిన లావాదేవీలకు నమ్మకస్తుల అనుమతి తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. కుటుంబ సభ్యులు లేదా విశ్వసనీయ వ్యక్తుల పర్యవేక్షణలో లావాదేవీలు జరిగేలా ఈ విధానం ఉండనుంది.

‘కిల్ స్విచ్’ సదుపాయం
ఖాతా భద్రత కోసం ‘కిల్ స్విచ్’ అనే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే వినియోగదారు తన ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసుకునే వీలు ఉంటుంది. ఇది మోసాలను తక్షణమే నిలిపివేయడంలో సహాయపడుతుంది.



