స్పాట్ వాయిస్, నర్సంపేట : ప్రజా నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొని, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణ నుంచి అర్ధరాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గటిక అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడం కేవలం విగ్రహాన్ని తొలగించడం కాదని, నర్సంపేట ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రజల మనోభావాలనుఅవమానించడమేనని గటిక అజయ్ కుమార్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజల అభిప్రాయాలను, భావోద్వేగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.విగ్రహం తొలగింపు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం, కొందరిని అరెస్టు చేయడం మరింత దుర్మార్గమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సాధ్యం కాదని, అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ద్వారా ఆయన ప్రజల్లో సంపాదించుకున్న గౌరవాన్ని, అభిమానాన్ని ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. విగ్రహాన్ని తొలగించగలరు కానీ నర్సంపేట ప్రజల గుండెల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానాన్ని ఎవరూ తొలగించలేరని అన్నారు.అధికార పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని విడనాడి ప్రజల మనోభావాలను గౌరవించాలని గటిక అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అరెస్టులు, పోలీసుల నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
