ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ధర్నా
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: మండలంలో రైతులు పండించిన ధాన్యానికి కొనుగోళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై కొమ్మల టోల్గేట్ వద్ద లారీల కోసం రైతులు ధర్నా నిర్వహించారు. గంటల తరబడి వేచి చూసినా వాహనాలు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకుడు వారాల రమేష్ యాదవ్ రైతులకు సంఘీభావం తెలుపుతూ, తహసీల్దార్ రాకేష్ రెడ్డి, ఎస్సై నరేష్ యాదవ్లకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ తండా సర్పంచ్ పయ్యావుల రవి యాదవ్, మాజీ ఎంపీటీసీ మాలోత్తు నర్సింహా నాయక్తో పాటు స్థానిక రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

