భారీగా ఆస్తి నష్టం..
ప్రాణాలతో బయటపడ్డ కుటుంబ సభ్యులు
ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బానాల (కమ్మరి) రవి ఇంట్లో రాత్రి 8 గంటల సమయంలో ఫ్రిడ్జ్ వద్ద అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. మంటల తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు, బీరువా, ఫ్రిడ్జ్, ఫర్నిచర్తో పాటు విలువైన గృహోపకరణాలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆదుకోవాలని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
