
- లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం
- 9 మంది పోలీసులకు మరణదండన
- సాత్తన్కులం లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు
స్పాట్ వాయిస్, వరంగల్: తూత్తుకుడి జిల్లా సాత్తన్కులంలో జరిగిన లాకప్ డెత్ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2020లో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితులుగా ఉన్న 9 మంది పోలీస్ సిబ్బందికి కోర్టు మరణదండన విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో న్యాయం జరిగిందని భావిస్తున్నారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం వారిపై అమానుషంగా హింసకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రమైన గాయాలతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం
ఈ కేసులో లేడీ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. స్టేషన్లో బాధితులను గంటల తరబడి దారుణంగా కొట్టారని, గాయాలు తీవ్రమైనప్పటికీ వైద్యం అందించలేదని ఆమె కోర్టులో వెల్లడించింది. జరిగిన ఘటనలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పడంతో కేసు మరింత బలపడింది.
9 మంది పోలీసులకు మరణం దండణ..
విచారణలో భాగంగా మొత్తం 9 మంది పోలీస్ సిబ్బందిపై కేసు నమోదు కాగా, కేసును CBI దర్యాప్తు చేసింది. ఈ కేసులో శిక్ష పడిన పోలీసులుగా ఎస్. శ్రీధర్, టి. బాలకృష్ణన్, రఘు గణేష్, మురుగన్, ముత్తురాజా, సమదురై, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు ఉన్నారు.
కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మద్రాస్ హైకోర్టు కూడా సువో మోటోగా జోక్యం చేసుకుని విచారణను పర్యవేక్షించింది. సాక్ష్యాలు, వాంగ్మూలాలు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా కోర్టు కఠినంగా స్పందిస్తూ నిందితులకు మరణదండన విధించింది.
ఈ ఘటన దేశంలో పోలీస్ కస్టడీ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన కేసుగా నిలిచింది. పోలీస్ వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని కూడా ఈ తీర్పు మరోసారి గుర్తుచేసింది.


