
అక్షర చిట్ఫండ్ ఛైర్మన్ శ్రీనివాసరావు అరెస్ట్
ఆదిలాబాద్ లో పట్టుకున్న పోలీసులు
ఆదిలాబాద్: చిట్ఫండ్ వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన అక్షర చిట్ఫండ్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో అక్షర చిట్ఫండ్ సంస్థను స్థాపించి వ్యాపారం ప్రారంభించారు. ప్రారంభంలో నమ్మకాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని స్కీంలను సక్రమంగా నిర్వహించిన ఆయన, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన చిట్ఫండ్ పథకాల పేరుతో వందలాది మంది నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు.
అయితే గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 12 కేసులు నమోదవగా, బాధితులకు సుమారు రూ.1.11 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
కేసులు నమోదు కావడంతో శ్రీనివాసరావు గత ఆరు నెలలుగా పరారీలో తిరుగుతూ పోలీసులను తప్పించుకుంటూ వచ్చారు. అయితే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా ఆయన కదలికలను గుర్తించి చివరకు ఆదిలాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా శ్రీనివాసరావుకు వివిధ జిల్లాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులలో కొన్ని ఇప్పటికే జప్తు చేయగా, మిగిలిన ఆస్తులను కూడా చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, బాధితులకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. చిట్ఫండ్ పేరుతో మోసపూరిత పథకాలకు ప్రజలు మోసపోవద్దని, అనుమానాస్పద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

