దామెర పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీసీపీ అంకిత్ కుమార్
స్పాట్ వాయిస్, దామెర: వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శనివారం దామెర పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతి భద్రతల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, విధుల్లో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై కొంక అశోక్ పాల్గొన్నారు.


