స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన పెట్రోలింగ్లో 1 కేజీ 400 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాజీపేట సీఐ శ్యాంసుందర్ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమెన్ ఎస్ఐ ఎస్. మౌనిక తన సిబ్బందితో కలిసి కడిపికొండ బ్రిడ్జి కింద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1 కేజీ 400 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులు కడిపికొండకు చెందిన బొల్ల ప్రవీణ్ కుమార్, కాజీపేటకు చెందిన మొహమ్మద్ అఫ్టాల్ పాషాగా గుర్తించారు. మరో నిందితుడు ఎండి సల్మాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.పోలీసుల విచారణలో నిందితులు గతంలో సెయింట్ జాన్ స్కూల్లో చదువుకున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డారని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి రూ.10 వేలకే గంజాయిని కొనుగోలు చేసి కాజీపేటలో సుమారు రూ.70 వేల వరకు విక్రయించేందుకు TS03-UD-4914 నంబర్ గల ఆటోలో తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయిని కాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో పంచుల సమక్షంలో తూకం వేసి నిబంధనల ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, గంజాయి రవాణా, విక్రయం, నిల్వ లేదా వినియోగం చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

