స్పాట్ వాయిస్, హనుమకొండ: నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపునకు నిరసనగా చేపట్టిన బంద్ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరుసగా మూడు రోజులుగా తమను నిర్బంధిస్తూ కుటుంబ సభ్యులను, నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందన్నారు. నర్సంపేటలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారని, వారిని బలవంతంగా ప్రేరేపించాల్సిన అవసరం లేదన్నారు. పెద్ది విగ్రహాన్ని తొలగించినా ప్రజల హృదయాల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని చెరిపివేయలేరన్నారు. ప్రభుత్వం వెంటనే తప్పును సరిదిద్దుకుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
