వృద్ధుడిపై దాడి, గొలుసు అపహరణ
కాలు విరగ్గొట్టిన దుండగులు..
బాధితుడికి తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్, గణపురం:మండల కేంద్రంలోని కొత్తపల్లిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధుడిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనారాయణ హైస్కూల్ ఎదురుగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఎర్రబెల్లి మాధవరావు తన భార్య విజయలక్ష్మితో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఆయన మూత్ర విసర్జన కోసం బయటకు రాగా, అప్పటికే మాటు వేసిన గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. మెడలోని రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని, ఆయన్ను కిందకు తోసేశారు. ఈ దాడిలో మాధవరావు కాలు విరిగింది. ఆయన ఆర్తనాదాలు విని భార్య బయటకు వచ్చేలోపే నిందితులు చీకట్లోకి పరారయ్యారు. అర్ధరాత్రి కావడంతో బంధువులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో బాధితుడు రాత్రంతా నొప్పితో విలవిల్లాడారు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న బంధువులు ఆయనను హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

