మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ
స్పాట్ వాయిస్, వరంగల్: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ, కొండా మురళి తొలిసారి వరంగల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చేలా సాగాయి. రేవంత్రెడ్డి వంటి మాస్ లీడర్ కాంగ్రెస్కు అవసరమని తొలుత చెప్పింది తానేనని గుర్తుచేశారు. ఎలాంటి తప్పులు చేయకుండా మంత్రి బాధ్యతలు నిర్వర్తించానని, పదవి పోయినందుకు బాధ లేదని, అకారణంగా తొలగించడమే బాధ కలిగించిందన్నారు. పదవి కోల్పోయిన అనంతరం అల్లర్లకు దిగాలని కొందరు ఫోన్ చేసినా, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తానే చెప్పానన్నారు. ప్రజల్లోనే ఉంటామని, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ నుంచి తనకే టికెట్ వస్తుందని, మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చి మరోసారి మంత్రి అవుతానని సురేఖ ప్రకటించారు.

