స్పాట్ వాయిస్, గణపురం:మండలంలోని కర్కపల్లి గ్రామంలో వడదెబ్బ తగిలి ఓ పండ్ల వ్యాపారి మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్కపల్లి గ్రామానికి చెందిన గాదె అంజయ్య (48) ద్విచక్ర వాహనంపై గ్రామాల వెంబడి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే బుధవారం ఉదయం పండ్ల వ్యాపారానికి వెళ్లిన అంజయ్య, మద్యాహ్నం వేళకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తీవ్రమైన ఎండల కారణంగా అలసిపోయిన ఆయన, ఇంటి ముందున్న అరుగుపై కూర్చుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రమైన ఎండ దెబ్బ తగలడం వల్లే అంజయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అంజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంజయ్య అకాల మరణంతో కర్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

