నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నర్సంపేటలో ఉద్రిక్తతకు దారి తీసింది. సమస్యల పరిష్కారంలో సర్కారు వైఖరిని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే మంటలు ఆర్పారు. అప్పటికే దాదాపు 90 శాతం కాలిన గాయాలతో హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో నర్సంపేట లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో డిపో వద్ద పోలీసులు భారీగా మొహరించారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు.

