స్పాట్ వాయిస్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ర్యాలీలు ఒకే సమయంలో జరగడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్కు పోలీసులు కేటాయించిన సమయం ముగిసినా ర్యాలీ కొనసాగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో ర్యాలీకి వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు కేటాయించిన సమయం ఉన్నప్పటికీ వాహనాలను ఎందుకు నిలిపివేస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.