బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేశాయో చెప్పాలి
స్పాట్ వాయిస్, హనుమకొండ: గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ వరంగల్ అభివృద్ధికి ఏం చేశాయో ప్రజలకు చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో వరంగల్ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చిందన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సుమారు రూ.5,300 కోట్లు, శాశ్వత తాగునీటి వసతుల కోసం రూ.550 కోట్లకు పైగా నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక ఫిల్టర్ బెడ్లు, పాత పైప్లైన్ల సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.వరంగల్ ఎయిర్పోర్ట్కు అనుమతులు తీసుకొచ్చామని, భూసేకరణకు సుమారు రూ.300 కోట్లు కేటాయించామని చెప్పారు. రింగ్రోడ్డు భూసేకరణను వేగవంతం చేస్తున్నామన్నారు. ఐటీఐ అభివృద్ధికి రూ.25 కోట్లు, పాలిటెక్నిక్కు నిధులు తీసుకొచ్చామని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి విభజన చట్టం హామీకి మళ్లీ జీవం పోశామన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. వరంగల్ అభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గత పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.