ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాసరెడ్డి
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ మహానగరంలోని చారిత్రక భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆలయ ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఘనస్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించారు. అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారదా దేవి, చాహత్ బాజ్పాయ్ తదితరులు ఉన్నారు.
