స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్పూర్: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన స్టేషన్ ఘన్ పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తుడు గుర్రపు అంజయ్య కుటుంబానికి జనగామ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె బాలకృష్ణ అండగా నిలిచారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు సూచన మేరకు, మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ మానవతా దృక్పథంతో స్పందించారు. తన వంతు సాయంగా ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు. గుర్రపు అంజయ్య మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు ఆయన ఇద్దరు పిల్లలు కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పరిస్థితిని తెలుసుకున్న ఏలె బాలకృష్ణ వెంటనే స్పందించి, అండగా నిలవగా బాలకృష్ణను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రపు యాదమ్మ, ఉపసర్పంచ్ దాసు శ్రీకాంత్, కారోబార్ రాజు తదితరులు పాల్గొన్నారు.