SPOT VOICE
Newspaper Banner
Date : 20 August 2026, 9:51 am Posted By : SPOT VOICE MEDIA

మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్

*వైద్యుల నిర్లక్ష్యం..
* మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో దారుణం
* బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్
స్పాట్ వాయిస్, డెస్క్ : మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళకు డాక్టర్లు చేసిన ట్రీట్ మెంట్ అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. ఆపరేషన్ అనంతరం మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది.
వివరాలిలా ఉన్నాయి. వడ్వాణి గ్రామానికి చెందిన సంధ్య అనే మహిళ ఆగస్టు 1న ప్రసవం కోసం బీడ్‌ జిల్లా ఆస్పత్రిలో చేరగా, అదే రోజు సాయంత్రం ఆపరేషన్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేయగా, ఇంటికి వెళ్లిన కొద్దిరోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పుణెలోని సాసూన్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి, ఆమె కడుపులో ఉన్న గ్లౌజులు, పేపర్‌ వైప్స్‌ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. అయితే తన భార్య పరిస్థితికి మొదటి ఆపరేషన్‌లో జరిగిన నిర్లక్ష్యమే కారణమని సంధ్య భర్త సూరజ్‌ గైక్వాడ్‌ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే విషయం సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.