వడదెబ్బతో తిప్పని సారయ్య మృతి
స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి తిప్పని సారయ్య (62) అనే వ్యక్తి సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతకు గురైన సారయ్య ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితిని గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఆయన్ను వెంటనే వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గ్రామంలో విషాద ఛాయలు
మండలంలో అందరికీ సుపరిచితుడైన సారయ్య మరణవార్త వినగానే గణపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సారయ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.