సౌర విద్యుత్తో సొమ్ము ఆదా..
సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్
మండల కేంద్రంలో 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
స్పాట్ వాయిస్, గణపురం:ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ ఉత్పత్తిపై ఆసక్తి చూపి ఆర్థికాభివృద్ధి సాధించాలని గణపురం సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని వొల్లాల రాజు నివాసంలో ‘ఎస్2ఎం గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్యఘర్’ పథకం సామాన్యులకు ఒక వరమని కొనియాడారు. ఈ పథకం కింద లభించే సబ్సిడీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి పైభాగంలో సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, అదనంగా ఉన్న విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందవచ్చని, నిరంతరం పెరుగుతున్న కరెంటు బిల్లుల భారం నుండి సామాన్యులకు శాశ్వత ఉపశమనం లభిస్తుందని, కాలుష్య రహితమైన సోలార్ విద్యుత్ వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడిన వారవుతారని అన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఎస్2ఎం గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్2ఎమ్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తడక శ్రీధర్, డైరెక్టర్ దాశరధి సుదర్శన్ మాట్లాడుతూ.. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో తమ కంపెనీ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.