ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ
స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ (బొగ్గు చూర) ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రత కారణంగా ఎండ వేడికి బొగ్గు నిల్వల్లో మంటలు పుట్టినట్లు తెలుస్తోంది. గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. కిలోమీటర్ల మేర నల్లని పొగ మేఘాలు కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మంటల ధాటికి ప్లాంట్ పరిసరాల్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.