ఇద్దరు మహిళా కూలీల పరిస్థితి విషమం
స్పాట్ వాయిస్, గణపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం ఉదయం సుమారు 5:25 గంటల ప్రాంతంలో వెలుతుర్లపల్లి క్రాస్ కు చెందిన కూలీలు ఆటోలో ఎక్కి పనులకు వెళ్తున్న క్రమంలో వెనుక నుండి వచ్చిన ఒక లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంటోజు సుగుణ, కడారి శ్రీలత అనే ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం సుగుణ, శ్రీలత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.