స్పాట్ వాయిస్,కాజీపేట: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో జరిగిన తండ్రి కూతుళ్ళ సజీవ దహన ఘటన… తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాదులో ఉండే రాజశ్రీ-ప్రవీణ్ దంపతులు.. రెండు రోజుల క్రితమే కడిపికొండకు వచ్చినట్లు తెలిసింది. వీరికి ఇద్దరు సంతానం కాగా కూతురి అన్నప్రాసన కార్యక్రమం కోసం వచ్చినట్లు సమాచారం. మంగళవారం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత.. ఏమైందో ఏమో కానీ తెల్లవారుజామున.. ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే రాజశేఖర్, కూతురు రాజశ్రీ మంటల్లో కాలిపోయారు.
అల్లుడే కారణమా..!
కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుత్తి తో మామను, భార్యను హత్య చేసిన అనంతరం, దానిని అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. సీఐ కిషన్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు.క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు.


