SPOT VOICE
Newspaper Banner
Date : 23 March 2026, 1:04 pm Posted By : SPOT VOICE MEDIA

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధనలు

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధనలు

* ముందుగా రోడ్డు భద్రతపై ఆన్‌లైన్ పరీక్ష పాస్..

* తరువాతే లెర్నర్ లైసెన్స్ (LLR)

స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం లక్ష్యంగా రాష్ట్ర రవాణాశాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

కొత్తగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ టెస్ట్

ఇప్పటివరకు లెర్నర్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ టెస్ట్‌లతోనే లైసెన్స్ జారీ చేస్తుండగా, ఇకపై అదనంగా ‘ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ టెస్ట్” తప్పనిసరి చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే LLR కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

కొత్త విధానం ప్రకారం, ముందుగా రోడ్డు భద్రతపై ఆన్‌లైన్ పరీక్ష రాసి పాస్ కావాలి. అనంతరం LLR పరీక్ష పూర్తి చేసి, చివరగా డ్రైవింగ్ స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.

రవాణాశాఖ అధికారులు తెలిపిన ప్రకారం, ఈ మార్పులతో డ్రైవర్లలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరుగుతుందని, బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసే సంస్కృతి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో రోడ్డు భద్రతపై సరైన అవగాహన కల్పించడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

కొత్త నిబంధనల నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత అంశాలపై సన్నద్ధం కావాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందే ప్రక్రియ కాస్త కఠినమైనా, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.